అయూబ్ చొరవకు మత పెద్దల ప్రశంసలు.. ఘన సన్మానం
వరంగల్, విజయ కెరటం ఆగస్టు 28:
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లేబర్ కాలనీలో ఉన్న మస్జిద్-ఏ-ఫలాహ్ వక్ఫ్ బోర్డులో నమోదు కావడంలో ప్రత్యేక చొరవ చూపిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ను మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
మస్జిద్ వక్ఫ్ బోర్డులో నమోదు కావడానికి అవసరమైన ప్రక్రియలో మహమ్మద్ అయూబ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనవంతు సహకారం అందించారని మత పెద్దలు, ముస్లిం సోదరులు తెలిపారు. ఈ సందర్భంగా అయూబ్కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
మస్జిద్ నమోదు ప్రక్రియ పూర్తికావడంపై కమిటీ సభ్యులు, స్థానిక ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేశారు. మస్జిద్ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి, ముస్లిం సమాజ సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ సహకారం అందించాలని మహమ్మద్ అయూబ్ను కోరారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. మస్జిద్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. వక్ఫ్ బోర్డులో నమోదు ప్రక్రియలో తనపై నమ్మకం ఉంచిన మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మత పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


