నల్లగొండ, సెప్టెంబర్ 15, విజయ కెరటం ప్రతినిధి:
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా.. లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ చదువునే తన ఆయుధంగా చేసుకున్న నకిరేకల్కు చెందిన అబూబకర్ సిద్ధిఖ్ నీట్ ఫలితాల్లో ప్రతిభ చూపించాడు.
అబూబకర్ తండ్రి మౌలానా అక్బర్ గతేడాది మృతి చెందారు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోనూ అబూబకర్ తన చదువును కొనసాగించాడు. పరిస్థితులు ఎన్ని ఎదురైనా వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో నిరంతరం కష్టపడ్డాడు.
ఈ క్రమంలో నిర్వహించిన NEET పరీక్షలో 552 మార్కులు సాధించి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు పొందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు అబూబకర్ను అభినందిస్తున్నారు.
తన వ్యక్తిగత కష్టాలను విజయానికి అడ్డంకిగా భావించకుండా లక్ష్యం వైపు సాగిన అబూబకర్.. కష్టపడి చదివితే పరిస్థితులను మార్చుకోవచ్చనే సందేశాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆయన విజయం ఒక ప్రేరణగా నిలుస్తోంది.
పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు.. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుందనే దానికి అబూబకర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది.


