తిప్పర్తి: మండలంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయని, సమస్యలపై జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని తిప్పర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ సిబ్బంది స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో రాత్రివేళ అత్యవసర సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు.
గాలులు, దుమారాల సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రిప్పింగ్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యలపై మండల అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆరోపించారు. సిబ్బంది కొరత ఉంటే వెంటనే అదనపు సిబ్బందిని నియమించి, వారు మండల కేంద్రంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యుత్ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని తిప్పర్తి మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


