విజయకేరటం – నల్గొండ
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మైనర్లు కావడంతో వారి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఆగస్టు 11న రాత్రి జేబీ కాలనీలోని తన నివాసంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించి, కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు 80 మందిని విచారించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
దర్యాప్తులో పిల్యా తండా, పుల్సింగ్ తండాలకు చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులపై అనుమానం బలపడటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో పాఠశాలకు సెల్ఫోన్ తీసుకురావడం, టీసీ ఇచ్చి పంపిస్తామని ప్రిన్సిపాల్ హెచ్చరించడం వంటి పరిణామాలపై వారు ఆగ్రహం పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అదే సమయంలో జల్సాలు, ఇతర ఖర్చుల కోసం డబ్బు అవసరమైందని, హత్య అనంతరం నగదు తీసుకెళ్లినట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు, మరో వ్యక్తి ప్రమేయం ఉందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో విలేకరుల సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.


