నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్పల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారనే అనుమానంతో ఓ మహిళ వారిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మదక్పల్లి గ్రామానికి చెందిన సోని అనే మహిళ తన భర్త భూమయ్య, అత్త భూదేవ్వను తొలగించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు (పురుగుమందు) కలిపి వారికి భోజనంగా వడ్డించింది.
భోజనం చేసిన కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో భూమయ్య, భూదేవ్వ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహిళే విషం కలిపినట్లు నిర్ధారణ కావడంతో నిందితురాలు సోనిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


