నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (BCWU-CITU) పట్టణ అధ్యక్షుడు సల్వోజు సైదాచారి అధ్యక్షతన కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 10న నల్లగొండ పట్టణంలో చేపట్టనున్న నిరసన ర్యాలీ, జైల్ భరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయించారు.
సమావేశంలో మాట్లాడిన ఎం.డి. సలీం, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి వాటిని పరిరక్షించాలని కోరారు.
అలాగే రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో ప్రజలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండపల్లి సత్తయ్య, BCWU జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సీఐటీయూ టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, కార్పెంటర్స్ యూనియన్ నాయకులు కాసోజు ప్రభుచారి, బైరోజు ఆంజనేయులు, గడగోజు శ్రీనివాస్ చారి, నరసింహ చారి, సోమయ్య చారి, గడగోజు సైదాచారి, జనార్ధన్ చారి, బత్తిలోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.


