హైదరాబాద్లోని హుప్పుగూడ రైల్వే స్టేషన్లో ఈ నెల 2న జరిగిన దారుణ హత్య కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నేపాల్కు చెందిన **రాజ్ కుమార్ శర్మ అలియాస్ యువరాజ్ శర్మ (47)**ను కాచిగూడ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆగస్టు 6న సీతాఫల్మండి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ కుమార్ శర్మ నేపాల్లోని ఖాట్మండుకు చెందిన వ్యక్తి. సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఫంక్షన్ హాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కూలీగా పనిచేస్తూ సికింద్రాబాద్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. మద్యం, గంజాయికి బానిసైన అతడు తరచూ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో తిరుగుతుండేవాడు.
ఆగస్టు 2న తన స్నేహితుడితో కలిసి హుప్పుగూడలో మద్యం సేవించిన అనంతరం మత్తులో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి తన బ్యాగ్ తీసుకెళ్లాడని భావించాడు. అనంతరం హుప్పుగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెం.1 వద్ద అదే వ్యక్తిని గుర్తించిన నిందితుడు అతనితో గొడవపడి, సమీపంలో ఉన్న గ్రానైట్ రాయి, సిమెంట్ ఇటుకతో తల, ముఖంపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సీసీటీవీ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టిన కాచిగూడ జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.
ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు అభినందిస్తూ, వారికి తగిన బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.


